ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఓ సభలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఆయన సందేహాలు వ్యక్తం చేయడమే దీనికి ప్రధాన కారణం. నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోందని, అందుకే ఈ పథకాన్ని అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి అమలు చేయలేకపోతున్నామని బాబు పేర్కొన్నారు.
బాబు మాట్లాడుతూ, “మీ పిల్లలు స్కూలుకు వెళ్లేలోపల తల్లికి వందనం పథకం అమలు చేయలేకపోతున్నాం. అది ఒక ఇన్ స్టాల్ మెంట్ నా? లేక డబ్బులుంటే ఇస్తాం.. లేదంటే కష్టమే” అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు విన్నవారు పథకం అమలుపై తీవ్రమైన అనిశ్చితి నెలకొందని అర్థం చేసుకుంటున్నారు.
‘తల్లికి వందనం’ పథకం అనేది గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి తరహాలోనే, పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో టీడీపీ మేనిఫెస్టోలో చేర్చిన హామీ. అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రజలకు హామీ ఇచ్చారు.నీకు రూ.15వేలు.. నీకు 18వేలు అంటూ హోరెత్తించారు. నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించారు.
చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో ఈ పథకంపై ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది తల్లులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి లోనవుతున్నారు. ఎన్నికల ముందు ఎన్నో ఆశలు కల్పించి, ఇప్పుడు నిధుల లేమిని సాకుగా చూపడంపై వారు మండిపడుతున్నారు. ముఖ్యంగా, బాబును నమ్మి ఓట్లేసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన వీడియో క్లిప్లు వైరల్ అవుతున్నాయి. ‘బాబు మళ్లీ మాట తప్పారు’, ‘ఇది ప్రజలను మోసగించడమే’ అంటూ నెటిజన్లు, ఓటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు ఈ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి, తల్లికి వందనం పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎన్నికల హామీల అమలుపై ఇది తొలి సంకేతమా లేక తాత్కాలిక ఇబ్బందా అనేది వేచి చూడాలి.