ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రసంగంలో నోరుజారి, ట్రోలర్స్, మీమర్స్ చేతికి దొరికిపోయారు. “చంద్రన్న ఉన్నంత వరకూ రైతులకు భరోసా లేదు, ఉండదు” అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా ప్రసంగాల్లో ఉత్సాహంగా మాట్లాడే క్రమంలో చంద్రబాబు తరచూ నోరుజారుతుంటారు. ఈసారి కూడా అదే జరిగింది. రైతులకు భరోసా కల్పిస్తానని చెప్పే క్రమంలో “చంద్రన్న ఉన్నంత వరకు రైతులకు భరోసా లేదు” అని తప్పుగా మాట్లాడారు. ఆయన త్వరగా తన తప్పును సరిదిద్దుకున్నా, అప్పటికే కొందరు ఈ క్లిప్ను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో క్లిప్, దానికి సంబంధించిన మీమ్స్ విపరీతంగా షేర్ అవుతున్నాయి.
ఇటీవల ఆయన చేసిన మరో ప్రకటన కూడా చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 15 నుంచి ప్రజలు పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అన్ని పనులు ఇంట్లో నుంచే చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనను కూడా నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు తరచూ ఇలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇలాగే వైరల్ అయ్యాయి. ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి పదేపదే ఇలాంటి పొరపాట్లు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సమస్యల గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.