ఒకప్పుడు బెల్ట్ షాపులు పెడితే బెల్టు తీస్తా అంటూ గర్జించిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే బెల్ట్ షాపులను సమర్థించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. జగన్ ప్రభుత్వ కాలంలో బెల్ట్ షాపులపై ఘాటుగా విమర్శలు చేసిన ఆయన, ఇప్పుడు తన టీడీపీ-కూటమి పాలనలో కొత్త మద్యం పాలసీ తెచ్చి వైన్ షాపుల సంఖ్య పెరగడానికి, బెల్ట్ షాపులు మళ్లీ వెలుగులోకి రావడానికి కారణమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజల ప్రాణాలను మద్యం ముప్పు నుంచి కాపాడుతానన్న వాగ్దానం మరచి, ఇప్పుడు ఆదాయం పేరుతో బెల్ట్ షాపులను జీవనోపాధిగా చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్య “బెల్ట్ షాపులు ప్రమాదకరం కావు, ఇవి కూడా ఒక జీవనోపాధే” సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జగన్ ప్రభుత్వం కాలంలో మద్యం అమ్మకాల నియంత్రణ, డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలను సమర్థిస్తూ విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు, ఇప్పుడు అదే విషయంపై మౌనం పాటించడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
ప్రజా ఆరోగ్యం కంటే ప్రభుత్వ ఆదాయమే ప్రాధాన్యమా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తోంది. గ్రామాలు, పట్టణాలు తిరిగి బెల్ట్ షాపులతో నిండిపోతుండగా, మహిళా సంఘాలు… యువజన సంఘాలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కొత్త మద్యం పాలసీ వల్ల బెల్ట్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగి, అవినీతి పెరగడం, మత్తు పదార్థాల దుర్వినియోగం ఎక్కువయ్యే ప్రమాదం ఉందని. పేద కుటుంబాలు మరింత కష్టాల్లోకి వెళ్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు మాటల మార్పు, విధానాల విరుద్ధత ప్రజల్లో నమ్మకం కోల్పోయేలా చేస్తోంది. “బెల్ట్ షాపులు పెడితే బెల్టు తీస్తా” అన్న మాట ఇప్పుడు ప్రజలే ఆయనకు గుర్తు చేస్తున్నారు. మద్యం మాఫియాలపై యుద్ధం చేస్తానన్న నాయకుడు, ఇప్పుడు వారికే ఆశ్రయం కల్పిస్తున్నారన్న విమర్శల నుంచి త్రుటిలో తప్పించుకోవడం కష్టమే.


