ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అవసరార్ధం వాడుకొని వదిలేసే వైఖరి కొత్త చర్చకు దారితీస్తోంది. తాజాగా ఏపీ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పీ. నడ్డా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వమే అభివృద్ధికి మార్గమని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచిన వైసీపీపై కనీసం బీజేపీ పెద్దలకు కృతజ్ఞత లేకుండా ఇంత తీవ్ర విమర్శలు రావడం ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఇది మోసపూరిత “రిటర్న్ గిఫ్ట్” అంటూ చర్చ సాగుతోంది.
అసలైన విషయమేంటంటే, బీజేపీకి ఏపీలో బలమైన పట్టు ఇంకా దొరకలేదు. తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలను సమతౌల్యంగా ఉంచుకోవడమే బీజేపీ వ్యూహం. ఒకదాన్ని పూర్తిగా బలహీనపరచడం బీజేపీకి అనుకూలం కాదని కేంద్రం భావిస్తోంది.
చంద్రబాబు ముందుచూపుతో వైసీపీ నేతలను బీజేపీలోకి పంపే అవకాశాన్ని నిరాకరించగా, బీజేపీ కూడా జాగ్రత్తగానే అడుగులు వేస్తోంది. ఏపీలో బీజేపీ స్వతంత్రంగా ఎదిగే స్థాయికి చేరేవరకు వైసీపీ, టీడీపీ రెండూ అవసరమేనని కేంద్రం లెక్కలు వేసుకుంటోంది.
అందువల్ల “రిటర్న్ గిఫ్ట్” అనేది కేవలం రాజకీయ వర్గాల ఊహ మాత్రమే. నిజానికి బీజేపీ వ్యూహం – రెండు ప్రధాన పార్టీలను నిలబెట్టి, తాను స్థిరపడే సమయాన్ని దక్కించుకోవడమే.