ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోనున్నాయా? సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారా? ఏకంగా 8 మంది మంత్రులను మార్చడంతో పాటు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల మార్పు కూడా ఉంటుందా? ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ తీవ్రంగా నడుస్తోంది.
గత కొద్దికాలంగా మంత్రివర్గ విస్తరణ తప్పదన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అనేకసార్లు ఆయన మంత్రులను హెచ్చరించినప్పటికీ, వారి పనితీరులో మార్పు రాకపోవడంతో ఇప్పుడు ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా, జూనియర్లతో క్యాబినెట్ ఏర్పాటు చేసిన ప్రయోగం విఫలమైందనే భావన సీఎం చంద్రబాబులో ఉన్నట్లు తెలుస్తోంది.
జూనియర్ల ఫార్ములా విఫలమా? సీనియర్లకు తిరిగి అవకాశం?
శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు, సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. కేవలం లోకేష్ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగానే జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారని విశ్లేషకుల అభిప్రాయం. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు దాదాపు 15 మంది సీనియర్లు మంత్రి పదవుల కోసం ఎదురుచూశారు. కానీ వారిని కాదని ఆయా జిల్లాల్లోని జూనియర్లకు అవకాశం లభించింది. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పరిటాల సునీత, జేసీ కుటుంబం నుంచి ఇలా చాలా మంది నేతలు పదవులు ఆశించినా దక్కలేదు.
అయితే, జూనియర్ ఫార్ములా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో ఇప్పుడు సీనియర్లను రంగంలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు మంత్రుల ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. గోదావరి జిల్లాల నుంచి మరో ఇద్దరిని తప్పిస్తారని సమాచారం. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి మరో నలుగురిని తప్పిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అంటే, మొత్తం ఎనిమిది మంది మంత్రుల మార్పు ఖాయమని తేలింది. ఇప్పటికే క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. అంటే, మొత్తం తొమ్మిది మంత్రి పదవులకు గాను, ఒకటి జనసేనకు, మరొకటి బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. మిగిలిన ఏడు మంత్రి పదవులు టీడీపీ సీనియర్లకు దక్కే అవకాశం కనిపిస్తోంది.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల మార్పుపైనా చర్చ
మరోవైపు, స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్ సైతం క్యాబినెట్లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆది నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టి ‘నోరు మూయించారన్న’ వ్యాఖ్యలు వినిపించాయి. ఎందుకంటే అయ్యన్నపాత్రుడు రాజకీయంగా చాలా దూకుడుగా ఉండేవారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే ప్రతిపక్షంపై ఓ రేంజ్లో ప్రతాపం చూపుతారని ఒక అభిప్రాయం ఉంది.
మరోవైపు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును సైతం క్యాబినెట్లోకి తీసుకుంటారని, ఆయన స్థానంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని మరో చర్చ ఉంది. అయితే, స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన నేతను తీసుకుంటారని, అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.