టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా మరో అద్భుతమైన ఆవిష్కరణతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సముద్రం లోపల కృత్రిమ మేధస్సు (AI) డేటా సెంటర్ను ఏర్పాటు చేసి సంచలనం సృష్టించింది.
హాంకాంగ్కు ఆగ్నేయ దిశలో ఉన్న లింగ్ షుయి తీర ప్రాంతంలో ఈ అత్యాధునిక డేటా సెంటర్ను చైనా ప్రారంభించింది. ఈ కేంద్రంలో దాదాపు 400 అత్యాధునిక హైపెర్ఫార్మెన్స్ సర్వర్లను చల్లబరిచే వ్యవస్థలు ఉన్నాయి. ఇవి పారిశ్రామిక రంగం నుంచి సముద్ర పరిశోధన వరకు వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో ప్రాసెస్ చేయగలవు. అక్షరాలా ఒకే ఒక్క సెకనులో ఏకంగా 7 వేల AI ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది.
ఈ సందర్భంగా చైనా అధికారులు మాట్లాడుతూ, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సముద్ర గర్భ డేటా సెంటర్ల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వారు వెల్లడించారు.
సముద్రం లోపల డేటా సెంటర్ ఏర్పాటు చేయడం అనేది ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఇది డేటా నిల్వ మరియు ప్రాసెసింగ్ రంగంలో కొత్త అవకాశాలను తెరుస్తుంది. సహజంగానే సముద్ర గర్భంలో ఉండే చల్లని వాతావరణం సర్వర్లను చల్లబరచడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, భూమిపై స్థలం కొరతను అధిగమించడానికి కూడా ఇది ఒక మంచి పరిష్కారం.
చైనా సాధించిన ఈ అద్భుత విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలు ఈ తరహా వినూత్నమైన సాంకేతికతను అనుసరించే అవకాశం ఉంది. మొత్తానికి, సముద్ర గర్భంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలనే చైనా ఆలోచన టెక్నాలజీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.