రాజకీయాల్లో ప్రశ్నించేది ప్రజల కోసమా? లేక అవసరానికి తగ్గట్టు పక్షపాతమా? ఈ ప్రశ్న ఇప్పుడు మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారంతో తెరపైకి వచ్చింది. ఒకప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి దండం పెట్టించాడని, లేదా పెట్టించుకున్నాడని పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పవన్, ఇప్పుడు అదే పద్ధతిలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డికి అందరి ముందే దండం పెట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
అప్పట్లో జగన్ విషయంలో “ఇది ప్రజాస్వామ్యమా? రాజభక్తి రాజకీయమా?” అంటూ గర్జించిన పవన్,
“ఒక సీఎంకి దండం పెట్టాల్సిన అవసరమేంటి?” అని ప్రశ్నించిన పవన్, ఇప్పుడు తానే అదే పని చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇక్కడ మరో విషయం కూడా గమనించాల్సిందే. పవన్ దండం పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తిరిగి దండం పెట్టలేదు. అయినా పవన్ మౌనం వీడలేదు. ఇదే విషయం జగన్ విషయంలో జరిగితే మాత్రం ఆకాశాన్ని తాకే స్థాయిలో విమర్శలు చేసేవారు. అప్పుడు సూత్రాలు… ఇప్పుడు సౌకర్యమా? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది.
ఇప్పుడు రాజకీయంగా మరో వ్యంగ్య వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “అన్నయ్య పెట్టాడు దండం… తమ్ముడు పెట్టాడు పిండం…” అన్నది ఇప్పుడు పవన్కే వర్తిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ అసలు ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి విషయంలో పవన్ మౌనంగా ఉండటానికి కారణం సానుభూతా? లేదా తెలంగాణలో ఉన్న ఆస్తులా? లేదా రాజకీయ అవసరమా? అన్నది ఆలోచించాలి.
“మా అన్నయ్యతో దండం పెట్టించుకుంటావా?” అంటూ ఒకప్పుడు గుండెలు బాదుకున్న పవన్, ఇప్పుడు అదే స్టైల్లో తనే దండం పెట్టేసరికి ఆయన రాజకీయ వైఖరిపై సందేహాలు పెరుగుతున్నాయి. ప్రజలు చూస్తున్నారు… ప్రశ్నిస్తున్నారు… పోల్చి తూకం వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిందే విలువల కోసమని చెప్పుకుంటారు. మరి ఆ విలువలు ఇప్పుడు పరిస్థితులను బట్టి మారిపోతున్నాయా? లేక విమర్శలు చేసేటప్పుడు ఒక ప్రమాణం, చేసుకునేటప్పుడు మరో ప్రమాణమా?
ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పట్లో పవన్ నుంచే రావాల్సి ఉంది. ఎందుకంటే మౌనం కూడా ఒక రాజకీయ సమాధానమే కదా!


