ఏపీలో ఇటీవలి కొన్ని సంఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సమాజంలో మానవత్వం మాయమవుతుందా అనే సందేహం కలిగించేలా బాధాకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఒక ఘటన వేదనను కలిగించింది.
శాంతిపురం మండలంలోని కర్లగట్టు గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో ఓ వృద్ధురాలిని గ్రామస్తులు విద్యుత్ స్తంభానికి తాళ్ళతో కట్టి, దుర్భాషలాడుతూ చిత్రహింసలు పెట్టారు. ఆమె కన్నీటి పర్యంతమవుతూ “నాకు ఎవరూ లేరు… ఇలా ఎందుకు చేస్తున్నారు?” అని వేధింపుల గురించి వాపోయింది. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఘటనపై పెద్ద ఎత్తున స్పందన వెలువడింది.
ఇదే కాకుండా ఇటీవల కుప్పం ప్రాంతంలో వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం భర్త అప్పు తీసుకున్న పాపానికి అతని భార్యను తాళ్ళతో కట్టి చిత్రవధ చేయగా, పసివాడు ఏడ్చిన దృశ్యం కలత కలిగించింది. ఆ వీడియో కూడా వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, బాధితురాలికి సహాయం అందించింది. నిందితులను అరెస్టు చేయడంతో పాటు పోలీసు విచారణ చేపట్టారు.
అంతే కాకుండా విద్యార్థులతో పాఠశాలలో పారిశుధ్య పనులు చేయిస్తున్న వీడియో కూడా బయటపడి సమాజంలో చర్చకు దారితీసింది. ఇప్పుడు తాజా ఘటనగా వృద్ధురాలిపై జరిగిన ఈ దాడి తీవ్రంగా స్పందింపజేస్తోంది