ఎమ్మెల్యేలు మాత్రమే కాదు… ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లైట్ తీసుకుంటున్నారా? పదే పదే పద్ధతి మార్చుకోవాలని చెబుతున్నా, ఆయన మాటను ఖాతరు చేయకుండా మంత్రులు తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది ఆయనలో మరింత ఆగ్రహాన్ని పెంచుతోంది.
ఈ క్రమంలోనే, గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్లోనూ సీన్ రిపీట్ అయ్యింది. ఏకంగా మంత్రులపైనే చంద్రబాబు చిందులు తొక్కినట్లు సమాచారం. దీనికి కారణం… కొందరు మంత్రులు కేబినెట్ భేటీకి ఆలస్యంగా రావడం! “నా అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీనే పట్టించుకోరా?” అని ఆయన తీవ్రంగా మండిపడ్డారట. ఆపై కాస్త శాంతించి, “మంత్రులు అయ్యుండి మీరే టైంకి రాకపోతే ఎలా?” అని కాస్త తగ్గిన వాయిస్తో మాట్లాడారట. ఆలస్యంగా వచ్చిన వారిలో ఆనం రామనారాయణరెడ్డి, సంధ్యారాణి, సుభాష్లు ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ ఆలస్యం ఘటన జరగడం గమనార్హం.బుధవారం జరిగిన హెచ్ఓడీల సమావేశంలోనూ చంద్రబాబు…మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.”చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తెలియడం లేదు” అని అన్నారు.ఫైళ్ల పురోగతి, ప్రాజెక్టుల స్థితి, బడ్జెట్ వినియోగం వంటి అంశాలపై మంత్రులు రోజువారీగా సమీక్ష చేయాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులు రప్పించడంలో మంత్రులు అట్టర్ప్లాప్ అవుతున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని అధికార వర్గాలు తెలిపాయి.
మంత్రులు ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండడం, ముఖ్యమంత్రి పదేపదే హెచ్చరించినా మార్పు రాకపోవడం చూస్తుంటే… సీఎం ఆదేశాలను వీరు అస్సలు లెక్కచేయడం లేదని స్పష్టమవుతోంది.

