తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడితే, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన 16 మంది పేర్లను బయటపెడతానని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్, దుబాయ్, ఢిల్లీలలో బస చేసిన వివరాలు తనకు తెలుసని ఆయన పేర్కొన్నారు.
కౌశిక్ రెడ్డి ఆరోపణల ప్రకారం, రేవంత్ రెడ్డి ఏకంగా మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, ఇది ఆరోపణలు మాత్రమే కాదని, వాస్తవాలని ఆయన నొక్కి చెప్పారు. “ఇద్దరు మంత్రులు ఈ పొట్టోడిని ఇంకా ఎన్ని రోజులు భరించాలి అని ఫోన్లో మాట్లాడుకున్నది రేవంత్ రెడ్డి ట్యాప్ చేసి విన్నాడు” అని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు, ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరిని ఇంటికి పిలిపించుకొని, తనను ఎందుకు భరించాలి అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారని కూడా ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రులు ఆందోళన చెందుతున్నారని, అందుకే కేబినెట్ మీటింగ్కు హాజరవ్వకుండా ఢిల్లీలో కూర్చున్నారని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్న తమ ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడని మంత్రులు ఢిల్లీలో పెద్ద గొడవ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తెలిసి రేవంత్ రెడ్డిపై సీరియస్గా ఉన్నారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయో, అధికార పక్షం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.