టాలీవుడ్లో మరో సంచలన రగడ మొదలైంది. టీవీ5 జర్నలిస్ట్ మూర్తి, వర్ధమాన నటుడు ధర్మ మహేష్ల మధ్య మాటల యుద్ధం ఆగేలా లేదు. గత కొంతకాలంగా మహేష్ భార్య గౌతమి వ్యవహారం చుట్టూ ఈ ఇద్దరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చెలరేగుతున్నాయి.
ధర్మ మహేష్ తాజాగా విడుదల చేసిన వీడియోలో, “మా ఇంట్లో మూర్తి భోజనం చేసి, ఇప్పుడు మా విషయాల్లో జోక్యం చేసుకోవడం చాలా తప్పు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమికి మద్దతుగా మూర్తి తన టీవీ డిబేట్లలో విపరీతంగా మాట్లాడుతున్నారని, “శివతాండవం” లా రెచ్చిపోతున్నారని ధర్మ మహేష్ ఆరోపించారు. ఈ వీడియో బయటకు రావడంతో మూర్తి అసలు బండారం బహిర్గతమైందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఇక దీనికి ప్రతిగా టీవీ5 మూర్తి కూడా వెనుకడుగు వేయకుండా ఒక సెటైర్ వీడియో విడుదల చేశారు. “నా జీవితంలోంచి దూరంగా వెళ్తున్న వారిని చూస్తుంటే బాధేస్తోంది. వాళ్లు నడుస్తూ కాదు, పరిగెత్తుకుంటూ పోవాలి కదా” అంటూ ధర్మ మహేష్ను ఉద్దేశించి మూర్తి సెటైర్ వేశారు.
ఈ రగడతో టాలీవుడ్ వర్గాల్లో, మీడియా సర్కిల్స్లో చర్చలు మరింత రగులుతున్నాయి. ఒక్కొక్కరిపై ఒక్కొక్కరు వీడియోలు రిలీజ్ చేస్తూ పబ్లిక్గా ఆరోపణలు చేసుకోవడం, సినీ వర్గాలకు కొత్త గాసిప్స్ను తెచ్చిపెట్టింది. ధర్మ మహేష్-గౌతమి వ్యక్తిగత జీవితం చుట్టూ మూర్తి పాత్ర ఎంత వరకు ఉందనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోతోంది.
ఈ వివాదం ఇక్కడితో ఆగేలా కనబడకపోవడం, ఇంకో రౌండ్ వీడియో వార్ జరిగే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.