వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న ధర్మాన ప్రసాదరావుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న ధర్మాన, తాజాగా మళ్లీ క్రియాశీలకంగా మారారు. ఇది పూర్తిగా కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తెచ్చాయి. ధర్మాన బ్రదర్స్, కింజరాపు కుటుంబం కలిసి పార్టీని నాశనం చేస్తున్నారంటూ దువ్వాడ ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ వ్యాఖ్యలకు భిన్నంగా, జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాదరావునే మరింత నమ్మకం ఉంచడం దువ్వాడకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ధర్మాన ప్రసాదరావుకు తాడేపల్లి కేంద్ర కార్యాలయ బాధ్యతలు అప్పగించే యోచనలో జగన్ ఉన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం ఇచ్చే అంశంపైనా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ధర్మాన కుటుంబాన్ని కాదని దువ్వాడ లాంటి నేతకు ప్రాధాన్యం ఇవ్వడం కష్టం అన్నది స్పష్టమవుతోంది.
ఈ పరిణామాలతో దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకం నెలకొంది. ధర్మానకు లభిస్తున్న ఈ ‘ప్రమోషన్’తో దువ్వాడ ఆశలు పూర్తిగా నీరుగారినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


