ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమాలపై తమ వద్ద పటిష్టమైన ఆధారాలు ఉన్నాయని, సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను కోర్టు అంగీకరించరాదని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టులో గట్టిగా వాదించారు. ఫైబర్నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి తరఫున ఆయన ఈ వాదనలు వినిపించారు.
చంద్రబాబు హయాంలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి సీఐడీ గతంలోనే అన్ని ఆధారాలను సేకరించిందని, ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం కోర్టుకు మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని పొన్నవోలు స్పష్టం చేశారు.
ఫైబర్నెట్ కుంభకోణానికి సంబంధించి బాబు అక్రమాలపై సీఐడీ అన్ని ఆధారాలు సేకరించింది. 90 మంది సాక్షులను విచారించింది. అక్రమాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ సైతం చేయించింది. ఈ ఆధారాలన్నీ రికార్డుల్లో ఉన్నాయి, వాటిని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి.
సీఐడీ ఉన్నట్టుండి క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పొన్నవోలు తెలిపారు. గతంలో సేకరించిన ఆధారాలను, సాక్ష్యాలను పట్టించుకోకుండా, ప్రభుత్వం మారగానే సీఐడీ వైఖరి మార్చుకుందని ఆయన ఆరోపించారు.
చట్టం ప్రకారం ఈ కేసులో ఏసీబీ కోర్టుకు కేవలం మూడే ఆప్షన్లు ఉన్నాయని సుధాకర్రెడ్డి వివరించారు. కోర్టు ముందున్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని కేసును విచారణకు తీసుకోవాలి. సాక్ష్యాధారాలు సరిపోవని భావిస్తే, తదుపరి దర్యాప్తునకు ఆదేశించాలి. లేదంటే, సీఐడీ క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ను ప్రైవేటు ఫిర్యాదుగా స్వీకరించాలి. సీఐడీ క్లోజర్ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటే, ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం పోతుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయాధికారి భాస్కరరావు ఈ కేసులో తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని ప్రకటించారు. దీనిపై త్వరలోనే కోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


