ప్రతీకారం.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గురువారం ఉదయం సంచలన పరిణామం చోటు చేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామునే వంశీ ఇంటికి చేరుకున్న పోలీసులు, ఇంటిని చుట్టుముట్టి, అరెస్ట్ వారెంట్ చూపించిన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ, అనంతరం టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించడం ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, చివరకు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తీరు టీడీపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ముఖ్యంగా, టీడీపీ కార్యాలయంపై దాడికి ఆయనకు సంబంధం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి.

అప్పట్లో జరిగిన దాడిపై టీడీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతోపాటు, గవర్నర్ మరియు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, ఈ ఘటనపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ధ్వంసం అయ్యిందనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ నేతలు ఆధారాలను సేకరించి, కేసును పునర్విచారణకు తీసుకురాగానే అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ ముందస్తుగా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినా, వారికి అనుకూలంగా నిర్ణయం రాలేదు.

గతంలో వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డవారిపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. గనుల శాఖ అక్రమాల కేసులో వెంకటరెడ్డి అరెస్టై, బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు కూడా అదే దిశగా కొనసాగుతున్న చర్యగా కనిపిస్తోంది. అయితే, ఇది కేవలం న్యాయపరమైన ప్రక్రియ అని, రాజకీయ కక్ష సాధింపు కాదని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.