తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామీణ అభివృద్ధి రంగం తీవ్ర అసమర్థతను ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి గ్రామ పంచాయితీలకు సంబంధించి జరిగిన నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. పల్లె పాలన పూర్తిగా పతనమైన స్థితిలో ఉంది. ప్రజలకు కనీస సౌకర్యాలు అందక ఆగ్రహం పెరిగిపోతోంది.
ప్రజా తీర్పు పట్ల భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటోందని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని సర్కార్ ఇప్పటివరకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికలు జరగక గ్రామ ప్రజలకు నాయకత్వం లేకుండా పాలన సాగుతుండటంతో సమస్యలు ఎక్కువయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పంచాయితీలకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామ పంచాయితీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. అనేక గ్రామాల్లో కచ్చితంగా నెలనెలా నడిచే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. కనీసంగా వీధి దీపాల మరమ్మత్తు కూడా సాధ్యపడని దుస్థితి నెలకొంది.
నిధుల కొరత వల్ల పారిశుధ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. దాంతో అనేక గ్రామాల్లో చెత్త శేకరణ, పారిశుధ్య నిర్వహణ పూర్తిగా నిలిచిపోయాయి. దానికి తోడు వర్షాలు పడుతుండటంతో డెంగీ, మలేరియా లాంటి అంటువ్యాధులు పెరిగిపోతున్నాయి. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
పరిశుభ్రతా కార్మికులు నెలల తరబడి జీతాలు అందక వేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తమకు జీతాలు రావడం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా కార్మికులు అప్పులు చేసి బతికే పరిస్థితి ఏర్పడింది. ఇదే స్థితి పంచాయతీ కార్యదర్శులకు కూడా వర్తిస్తుంది. వారు లక్షల్లో అప్పులు చేసి పంచాయితీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
కనీస అవసరాలు కూడా తీరకపోవడం, సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల గ్రామ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామాభివృద్ధి అన్నది రాష్ట్ర పురోగతికి మూలస్తంభం. పల్లెలను నిర్లక్ష్యం చేయడం, నిధుల గాలికొదిలే తీరు కొనసాగితే, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని పల్లె ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.