మెదక్ శాసనసభ్యులు, కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి రోహిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కొందరు స్థానికులు తమ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆయన సంస్కారం మరిచి బూతులు తిట్టారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, “కేసీఆర్ గాడు అందరి నెత్తిమీద 2 లక్షల అప్పు చేసి ఎత్తుకొని వెళ్ళిపోయిండు” అంటూ మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా, “నేను ఎవరికీ భయపడే వాడిని కాదు, కేసీఆర్ గాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వాడికి ఉచ్చ పోయించినా” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు తనను ప్రశ్నించడం పట్ల అసహనం వ్యక్తం చేసిన రోహిత్, వారిపై బూతులు తిట్టారని వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ప్రజల సమస్యలు వినడానికి బదులు, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మైనంపల్లి రోహిత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హుందాగా వ్యవహరించాల్సిన శాసనసభ్యులు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, ఇది వారి అహంకారానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. కేసీఆర్ పట్ల రోహిత్ ఉపయోగించిన భాషపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోహిత్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం మైనంపల్లి రోహిత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువ నాయకులు రాజకీయాల్లోకి వచ్చి భాష పట్ల, ప్రజల పట్ల సంస్కారవంతంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీకి సైతం ఇబ్బందికరంగా పరిణమించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.