గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు “సూపర్ సిక్స్, సూపర్ సెవెన్” అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతుల దుస్థితిని చూస్తుంటే రాష్ట్రానికి అరిష్టం వచ్చిందేనని ఆయన అన్నారు.
జగన్ డిమాండ్ చేస్తూ, చంద్రబాబు వెంటనే గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులను కలవాలి అని కోరారు. రైతులకు బాసటగా నిలిచేలా ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేయాలని సూచించారు. బుధవారం జరిగిన తన పర్యటన అనంతరం, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు కష్టాలు, నష్టాలే మిగిలాయి అని జగన్ ఆరోపించారు. పంటలకు మద్దతు ధర కల్పించడమే అక్కర్లేదు.. కనీసం కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ లేరు అని విమర్శించారు. ధాన్యం రైతుల పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు మిర్చి రైతులు కూడా అదే విధంగా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.
తాను అధికారంలో ఉన్న సమయంలో మిర్చి ధర క్వింటాలకు 21 నుంచి 27 వేల రూపాయల వరకు ఉండేదని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడేమో అది 11 వేలకు పడిపోవడం దారుణం అని మండిపడ్డారు. గుంటూరు మార్కెట్ యార్డ్ సీఎంఓకు అతి సమీపంలో ఉన్నా, చంద్రబాబు అక్కడి రైతుల బాధలను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు “సూపర్ సిక్స్, సూపర్ సెవెన్” అంటూ రైతులకు హామీలు ఇచ్చి, 20 వేల రూపాయలు ఇస్తామని నమ్మబలికారు అని జగన్ ఆరోపించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా సహా పలు సంక్షేమ పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. “పలావూ లేదు, బిర్యానీ లేదు.. రైతు భరోసా కూడా నిలిపివేశారు” అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.
చంద్రబాబు ఇప్పటికైనా కళ్లుతెరిచి రైతుల సమస్యలను గుర్తించాలి అని డిమాండ్ చేసిన జగన్, “రైతే రాజన్న” అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలని” స్పష్టం చేశారు.