కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి లక్ష్యంగా మారారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా ఆయన ఇంటిపై దాడి జరిగింది.
కిర్లంపూడిలో ఉద్రిక్తత
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఆదివారం తెల్లవారు జామున దాడి జరిగింది. జనసేన పార్టీకి చెందిన ఓ కార్యకర్త ట్రాక్టర్తో ఇంటి గేటును బలవంతంగా ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాడు. ‘జై జనసేన’ నినాదాలు చేస్తూ ప్రహరీగోడను దాటి ఇంట్లోకి చొచ్చుకెళ్లాడు. ఈ దాడిలో ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన కారు తీవ్రంగా దెబ్బతిన్నది.
అప్రమత్తమైన ముద్రగడ అనుచరులు
పెద్ద శబ్దంతో ముద్రగడ పద్మనాభం ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇంట్లో ఉన్న అనుచరులు వెంటనే స్పందించి దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శలు
ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇది ఉద్దేశపూర్వక రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి జరగడం ఒక సర్వసాధారణ విషయమైపోయిందని మండిపడ్డారు. ఈ దాడి వెనుక జనసేన హస్తం ఉన్నట్లు ఆరోపించారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాల వ్యక్తే దాడికి పాల్పడినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.
జగన్ భరోసా
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభాన్ని ఫోన్లో పరామర్శించారు. 20 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో, ముద్రగడ దాడి వివరాలను జగన్కు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి జనసేన కార్యకర్తేనని వెల్లడించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా జగన్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్టీ అండగా ఉంటుందని, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా నిలుస్తారని హామీ ఇచ్చారు.
ఈ ఘటన నేపథ్యంలో ఉమ్మడి కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కిర్లంపూడికి వెళ్లి ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించారు. ఘటనపై మరింత సమాచారం సేకరించారు. కాపు నేతలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.