కేరళ రాజకీయాల్లో మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు దుమారానికి దారితీశాయి. మలయాళ నటి, జర్నలిస్ట్ రినీ ఆన్ జార్జ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమయ్యాయి. రినీ ఆరోపణల ప్రకారం, కాంగ్రెస్ ఎమ్మెల్యే, యూత్ కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు రాహుల్ మంఖూటతిల్ అసభ్యకర సందేశాలు పంపి, హోటల్కు రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ విషయం పార్టీ నాయకత్వానికి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు.
రాహుల్ పేరు బహిర్గతం కావడంతో బీజేపీ కార్యకర్తలు ఆయన కార్యాలయం ముందు నిరసనలకు దిగారు. రచయిత హనీ భాస్కరన్ కూడా సోషల్ మీడియాలో రాహుల్పై తన అనుభవాన్ని బహిర్గతం చేస్తూ ఆరోపణలు చేశారు. ఇదే తరహాలో యూత్ కాంగ్రెస్లోనే మరికొన్ని మహిళా కార్యకర్తలు కూడా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
చర్యలు తీసుకోకుండా పార్టీ మౌనంగా ఉండటం వల్ల కాంగ్రెస్పై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పార్టీ రాహుల్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.