మీడియా రెండు ముఖాలు ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్పుకుంటుంటాం. ఒకవైపు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా హౌస్లు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచే ఛానళ్లు, పత్రికలు. అధికారంలో ఉన్నపుడు ఈ ఛానళ్లు ప్రజల సమస్యలు మరిచిపోతాయి. అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కనిపిస్తాయి. తమకు ఇష్టమైన నాయకుడు అధికారంలో ఉంటే ఆ ప్రాంతం పరిపూర్ణంగా మారిపోయిందని భావిస్తారు. అప్పుడు ఆ మీడియా ప్రతినిధుల మనస్తత్వం కూడా పూర్తిగా సానుకూలంగా ఉంటుంది. వారికి ప్రపంచం అందంగా కనిపిస్తుంది.
కానీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత అదే ఛానళ్లు, పత్రికలు ప్రజా సమస్యలు గుర్తుచేసుకుంటాయి. ప్రాంత సమస్యలు, లోపాలు కనిపించటం మొదలవుతుంది. ప్రతిదీ వ్యతిరేక దృష్టితో చూస్తారు. చర్చా వేదికలపై మాట్లాడేటప్పుడు కోపం, నిరాశ కనిపిస్తుంది. కొన్నిసార్లు వారి నోటిలో ఊహించలేనంత ఘాటు పదాలు కూడా వస్తాయి. ఇవన్నీ ఆ వ్యక్తిగత భావోద్వేగాలే గానీ, ఆ మీడియా హౌస్ ల దృక్పథం కాదు. అందుకే అటువంటి మాటలను మీడియా సంస్థలపై మోపకూడదు. వ్యతిరేక దృష్టితో చూడకూడదు.
ఇప్పుడు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యవహారం కూడా అలాగే జరిగింది. ఇటీవల సాక్షి ఛానల్ డిబేట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై ఆయన ఇప్పటికే క్షమాపణ చెప్పాడు. “నేను తప్పుగా మాట్లాడానని అంగీకరించాను, ఇప్పుడు కూడా మళ్లీ చెబుతున్నాను” అని ఆయన తన ఛానల్ద్వారా స్పష్టంగా చెప్పారు. అయినా, ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నాటకీయంగా అతన్ని తుళ్లూరు తరలించారు.
ఈ అరెస్ట్పై కూడా రాజకీయ పార్టీలు వేర్వేరు స్పందిస్తున్నాయి. కూటమి నేతలు “చట్టం తన పని తాను చేసుకుంటోంది” అంటుండగా, వైసీపీ నేతలు “పత్రికా స్వేచ్ఛపై కేసులు పెడతారా?” అంటూ విమర్శిస్తున్నారు. ఈ పరిణామాన్ని ఒకే దృక్కోణంలో చూడకూడదు. ఇది నాణానికి రెండు వాణిలాంటి అంశం.