టాలీవుడ్ నటి మంచు లక్ష్మి తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ వెబ్ మీడియా గ్రేట్ ఆంధ్రా జర్నలిస్ట్ వీ.ఎస్.ఎన్. మూర్తిపై ఆమె ఫిల్మ్ ఛాంబర్కు ఫిర్యాదు చేశారు. ఇంటర్వ్యూలో తనను అడిగిన కొన్ని ప్రశ్నలు తన గౌరవాన్ని దెబ్బతీసాయని ఆరోపిస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మంచు లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, జర్నలిస్ట్ మూర్తి తన వయసు, వేసుకునే దుస్తులపై ప్రశ్నలు అడిగారని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. “అది జర్నలిస్టిక్ ఇంటర్వ్యూ కాదు, నేరుగా వ్యక్తిగత దాడి. ఇది గౌరవం తక్కువ చేసే ప్రయత్నం. కేవలం వైరల్ కావడం కోసం ఇలా చేస్తున్నారు” అని ఆమె అన్నారు.
జర్నలిజం పట్ల తనకున్న గౌరవాన్ని గుర్తు చేసిన మంచు లక్ష్మి, “అన్ని మీడియా వ్యక్తుల పట్ల నాకు గౌరవం ఉంది. కానీ ఇలాంటి వ్యక్తిగత దాడులు సహించలేను. మేల్ డామినేట్ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి నాకు ఒక గుర్తింపు సంపాదించుకున్నాను. ఇలాంటి ప్రవర్తనను మౌనంగా వదిలేస్తే, ఇది మళ్లీ మళ్లీ జరుగుతుంది” అని వ్యాఖ్యానించారు.
తనపై జరిగిన ఈ ప్రవర్తనపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ను కోరుతూ ఆమె ఫిర్యాదు చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడే దిశగా ఈ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
టాలీవుడ్లో ఇప్పటివరకు జర్నలిస్టులపై ఇలాంటి ఫిర్యాదులు చాలా అరుదుగా వెలువడిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.