ప్రముఖ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు చిన్న కుమారుడు, నటుడు మంచు మనోజ్ తన అన్నయ్య మంచు విష్ణుపై ఆరోపణలు చేస్తూ తండ్రి ఇంటి ముందు ధర్నాకు దిగారు.
తన కారును మంచు విష్ణు బలవంతంగా తీసుకెళ్లారని, తనకు ఎక్కడా నిలువ నీడ లేనందున తండ్రి ఇంటికి వస్తున్నానని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. మోహన్ బాబు నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మోహన్ బాబు ఇంటికి కిలోమీటర్ దూరంలోనే పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
మంచు మనోజ్ ఒక్కసారిగా మోహన్ బాబు ఇంటికి రావడంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తన సమస్యను పరిష్కరించే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని మంచు మనోజ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
మంచు సోదరుల మధ్య నెలకొన్న ఈ వివాదం సినీ పరిశ్రమలోనూ, వారి అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.