రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక బలమైన పునాది. కానీ ఆ పునాది మీద సొంత భవనం నిర్మించుకోకపోతే, అది కేవలం పాత జ్ఞాపకాలను మాత్రమే గుర్తు చేస్తుంది. అలాంటి పరిస్థితిలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ప్రముఖ మహిళా నాయకులు, వైఎస్ షర్మిల మరియు కల్వకుంట్ల కవిత కనిపిస్తున్నారు. తమ అన్నల అండదండలు ఉన్నా, లేకపోయినా.. సొంత మార్గాన్ని వెతుక్కుంటున్న ఈ ఇద్దరి ప్రయాణంపై ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీని స్థాపించి దాన్ని మూసివేసి కాంగ్రెస్ లో విలీనం చేసి.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో చేతులు కలిపారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాలు ఆమె అన్న, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు అయిన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారాయన్నది బహిరంగ రహస్యం. ఇద్దరి మధ్య దూరం పెరగడం వల్ల షర్మిల తన రాజకీయ ప్రయాణంలో ఒంటరిగా పోరాడుతున్నారు.
అదేవిధంగా, కవిత కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె పేరు రావడం, ఆమె అరెస్ట్ కావడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈమె అసమ్మతి రాజేయడంతో పార్టీ నుంచి సస్పెన్షన్ విధించారు. ఈ ఇద్దరు నాయకులు ఒకే దారిలో నడుస్తున్నారా లేదా అనేది యాదృచ్ఛికం. కానీ వారి పనులన్నీ వారి ప్రత్యర్థులకు అవకాశాలు ఇస్తున్నాయి.
షర్మిల, కవిత ఇద్దరూ ఎల్లో మీడియా చేతిలో పావులుగా మారుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎల్లో మీడియా వారిని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. వారి చేష్టలు సొంత పార్టీలనే బలహీనపరుస్తున్నాయి. సొంత కుటుంబాలను కలవరపెడుతున్నాయి.
షర్మిల, కవిత తమ సొంత బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా, లేక ఎవరి స్వార్థ రాజకీయాలకు బలి అవుతున్నారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అన్నల అండ లేకుండా వారు రాజకీయంగా నిలబడగలరా లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
రాజకీయాల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కానీ ఈ ఇద్దరు నాయకుల ప్రయాణం మాత్రం ఇద్దరు సోదరీమణుల మధ్య ఉన్న విభేదాలు, రాజకీయ కుట్రలకు బలైపోతున్నారేమో అనే అనుమానాలకు తావిస్తోంది.