తిరుపతి: నటుడు మంచు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. విచారణ కొనసాగుతున్న సమయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన అధిక ఫీజుల అంశంపై నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులు కిడ్నాప్కు గురయ్యారు. పోలీసులు వారిని సురక్షితంగా విడిపించగా, ఈ ఘటనలో పాల్గొన్న వారు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు అని గుర్తించారు. దీంతో విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు.
ఈ కేసుతో తనకు సంబంధం లేదని, ఘటన సమయంలో తాను అక్కడ లేనని మోహన్ బాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ, అరెస్టు నుంచి రక్షణ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో మోహన్ బాబుకు షాక్ తగిలింది.

