తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం ఉంటున్న ఓ మహిళా గ్రామ రెవెన్యూ అధికారి (VRO) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మండల్ రెవెన్యూ అధికారి (MRO)కి తగిన శాస్తి జరిగింది. కొన్నేళ్లుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్న ఆ కామాంధుడు, గురువారం మరింత బరితెగించి ఆమె ఇంటికే వెళ్ళి దుస్తులు విప్పి తన కోరిక తీర్చాలంటూ వేధించడంతో బాధితురాలి తల్లి అతడిని చితకబాదింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే, నాయుడుపేటలో విధులు నిర్వహిస్తున్న MRO, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళా VROను కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. “మీ ఇంటికి వస్తా, కోడికూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా?” అంటూ అసభ్యకర మెసేజ్లు పంపేవాడు. బాధితురాలు ఈ వేధింపులను మౌనంగా భరిస్తున్నప్పటికీ, గురువారం ఆ MRO ఏకంగా ఆమె ఇంటికే వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుస్తులు విప్పి, తన కోరిక తీర్చాలంటూ VROను బలవంతం చేశాడు.
దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన బాధితురాలు వెంటనే తన తల్లికి సమాచారం ఇచ్చింది. కూతురు పడుతున్న బాధను తెలుసుకున్న తల్లి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి చేరుకుంది. ఇంట్లో MRO అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటం చూసి ఆగ్రహంతో ఊగిపోయింది. వెంటనే కర్ర తీసుకుని ఆ కామాంధుడిని చితకబాదింది. తల్లి ఆగ్రహం ముందు MRO ఏమీ చేయలేకపోయాడు. ఈ దాడిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇలాంటి నీచమైన అధికారులను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం సస్పెండ్ చేయడంతో సరిపోదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కార్యాలయాల్లో మహిళలకు రక్షణ కరువవుతోందని, ఉన్నతాధికారులు ఇలాగే ప్రవర్తిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితురాలి తల్లి చూపిన తెగువను పలువురు ప్రశంసిస్తున్నారు.