ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆయన కాకినాడలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మెడికవర్లో చేర్చారు. షుగర్ స్థాయిలు పడిపోవడంతో వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.
కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ తరలించేందుకు నిర్ణయించుకున్నారు. అయితే, రోడ్డు మార్గం కాకుండా ఎయిర్ అంబులెన్స్లో తరలించాలని వైద్యులు సూచించడంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి చొరవ
ముద్రగడ పద్మనాభం అస్వస్థత గురించి తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన కుమారుడు గిరికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గిరి పరిస్థితిని జగన్కు వివరించగా, ఆయన వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో మాట్లాడి ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయించారు. ఈరోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్ అంబులెన్స్లో ముద్రగడ పద్మనాభంను హైదరాబాద్కు తరలించనున్నారు. యశోద ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆయన కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్కు తరలించిన తర్వాతే ముద్రగడ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ముద్రగడ రాజకీయ ప్రస్థానం
ముద్రగడ పద్మనాభంకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. 1978లో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలలో పని చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇవ్వడంతో, ఆ హామీని అమలు చేయాలని కోరుతూ ముద్రగడ ఉద్యమ బాట పట్టారు. ఆ సమయంలో పలు కేసుల్లో కూడా ఇరుక్కున్నారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముద్రగడ నిలిపివేశారు. వైఎస్సార్సీపీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఆయన ఉద్యమం చేపట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే, 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ జనసేనలో చేరేందుకు ప్రయత్నించినా అవి ఫలించలేదు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన కుమారుడు గిరి ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తానని ముద్రగడ ప్రకటించిన కొద్ది రోజులకే అనారోగ్యానికి గురయ్యారు.