జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజంపేట ఎంపీ సీటు కేటాయింపుపై ఆయన స్పందిస్తూ.. మిథున్ రెడ్డికి ఆ సీటు కట్టబెడితే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని ఎక్కడ నిద్రపోతున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే, నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మరియు రాజకీయ విశ్లేషకులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
వేరే పార్టీలో సీట్ల సర్దుబాటు జరుగుతుంటే, నాగబాబు ఇంతలా ఆవేశపడటం వెనుక ఉద్దేశ్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మిథున్ రెడ్డికి సీటు ఇవ్వడం అనేది ఆ పార్టీ అంతర్గత విషయమని, దానికి అంబటి రాంబాబు, పేర్ని నానికి ఏం సంబంధమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నాగబాబు తన ఫ్రస్ట్రేషన్ భరించలేక ఇలాంటి విడ్డూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
నాగబాబు వ్యాఖ్యలపై నెటిజన్లు సూటిగా స్పందిస్తూ.. “అసలు నాగబాబు గానీ, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గానీ సింగిల్ గా పోటీ చేసి ఒక్క సీటైనా గెలిచే సత్తా ఉందా?” అని ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందేనని గుర్తు చేస్తున్నారు.నాగబాబు కూడా గతంలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. “సొంతంగా గెలిచే సత్తా లేనప్పుడు, పొత్తుల కోసం వెంపర్లాడే వాళ్ళు.. ఇతర పార్టీల నేతల నిద్ర గురించి, సీట్ల కేటాయింపు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది” అని ఒక నెటిజన్ ఎద్దేవా చేశారు.
గెలవలేనప్పుడు ఈ తరహా సొల్లు కబుర్లు ఎందుకు చెబుతున్నారని, జనసేన నేతలు కనీసం తమ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని విమర్శకులు సూచిస్తున్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి బలమైన నేతలపై విమర్శలు చేసే ముందు.. నాగబాబు తన రాజకీయ సత్తా ఏంటో నిరూపించుకోవాలని సవాల్ విసురుతున్నారు.
మొత్తానికి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనకే రివర్స్ అయ్యేలా కనిపిస్తున్నాయి. మరి దీనిపై నాగబాబు గానీ, జనసేన శ్రేణులు గానీ ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.


