తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన అధికారాన్ని చలాయిస్తున్న నాయకుడిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో టీడీపీ ప్రతినిధి ఈ అంశంపై సరైన సమాధానం చెప్పలేక, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించారు.
కేంద్ర కేబినెట్లో కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి చర్చ జరుగుతున్న సమయంలో, అసలు శక్తి ఎవరి చేతుల్లో ఉందనే ప్రశ్న వచ్చింది. అప్పుడే ఈ వ్యవహారం రచ్చకెక్కింది.
అర్నాబ్ గోస్వామి సూటిగా అడిగిన ప్రశ్నలకు టీడీపీ ప్రతినిధి తడబడుతూ, “రామ్మోహన్ నాయుడు కేవలం పేరుకే మంత్రి అనీ, నారా లోకేష్ ఆయన వెనుక ఉండి కేంద్రంలో, రాష్ట్రంలో అన్ని కీలక నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారనీ” అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అర్నాబ్ గోస్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. “నారా లోకేష్ ఎవరు? ఆయన ఏ పదవిలో ఉన్నారు? కేంద్ర మంత్రివర్గంలో లేని వ్యక్తి దేశ పాలనలో ఎలా జోక్యం చేసుకుంటున్నారు? రామ్మోహన్ నాయుడు ఒక ‘కనుసన్నల్లో పనిచేసే మంత్రి ‘ మాత్రమేనా? లోకేష్ నిజమైన పవర్ సెంటరా?” అంటూ అర్నాబ్ కడిగేశాడు.
ఈ ప్రశ్నల ధాటికి టీడీపీ ప్రతినిధి బిత్తరపోయి చూశారు తప్ప, పరువు నిలబెట్టే సమాధానం చెప్పలేకపోయారు. ముఖ్యంగా, ‘రామ్మోహన్ నాయుడు కేవలం ఒక తోలుబొమ్మ మంత్రి’ అని స్వయంగా పార్టీ ప్రతినిధి అంగీకరించినట్లుగా మారిన పరిస్థితి, జాతీయ మీడియాలో టీడీపీని తీవ్రంగా ఇరుకున పెట్టింది.
జాతీయ టీవీలో జరిగిన ఈ బహిరంగ చర్చ, టీడీపీ అంతర్గత అధికార నిర్మాణాన్ని, నిర్ణయాధికార స్వరూపాన్ని బట్టబయలు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


