ఆంధ్రప్రదేశ్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు ఉమ్మడి కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిఆర్టియు అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించారు. ఇది ఆయనకు మూడో విజయమైంది. ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన పాకల రఘువర్మపై ఆయన గెలిచారు. గత ఎన్నికల్లో రఘువర్మ గాదె శ్రీనివాసులు నాయుడుపై విజయం సాధించినప్పటికీ, ఈసారి ఆయన చేతిలోనే ఓటమి చెందడం విశేషం.
గాదె శ్రీనివాసులు నాయుడు విజయనగరం జిల్లాకు చెందినవారు. రఘువర్మ కూడా అదే జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ఉపాధ్యాయ వృత్తిలో సెకండరీ గ్రేడ్ టీచర్గా చేరిన ఆయన, ఉపాధ్యాయ సంఘాల్లో చురుకుగా వ్యవహరించారు. పిఆర్టియు సభ్యుడిగా చేరిన తరువాత, జిల్లా స్థాయిలో నాయకుడిగా ఎదిగి రాష్ట్ర కార్యవర్గంలో కూడా బాధ్యతలు నిర్వహించారు.
2007లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా శాసనమండలి విస్తరణ జరిగింది. అదే సంవత్సరం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పిఆర్టియు అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు, ఏపీటీఎఫ్ అభ్యర్థి సింహాద్రప్పడును ఓడించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2013లో కూడా అదే అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే, 2019లో పాకలపాటి రఘువర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం మళ్లీ రఘువర్మపై గెలిచి తన బలాన్ని చాటుకున్నారు.
గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు టీడీపీ కూటమికి పెద్ద దెబ్బగా మారింది. ఎందుకంటే, కూటమి ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ప్రకటించింది. టీడీపీ నేతలు రఘువర్మ గెలుపుకోసం ప్రచారం చేశారు. అయినప్పటికీ, ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయుల మద్దతు గాదె శ్రీనివాసులు నాయుడుకే లభించడంతో ఆయన విజయం సాధించారు.
తాను మూడోసారి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు.