వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు జైలుబాట పడుతున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో వివిధ కేసుల్లో చిక్కుకుని జైలు పాలవుతున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి సైతం అరెస్టు అవుతారని ప్రచారం నడుస్తోంది. అయితే, ఆయనకంటే ముందే మాజీ మంత్రులు ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఒక వార్త హల్చల్ చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒక కేసు విచారణకు పోలీస్ స్టేషన్కు రావాలని సూచించారు. దీంతో ఆయన అరెస్టు తప్పదని ప్రచారం ప్రారంభమైంది. తదుపరి వికెట్ అనిల్ కుమార్ యాదవ్దేనని తేలిపోయింది. అదే సమయంలో మాజీ మంత్రి రోజాకు సైతం త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మైనింగ్ కుంభకోణంలో అనిల్ కుమార్ యాదవ్ పాత్రపై అనుమానాలు
నెల్లూరులో క్వార్జ్ మైనింగ్ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మైనింగ్లో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. చాలా రోజులు అజ్ఞాతంలో గడిపిన గోవర్ధన్ రెడ్డిని ఇతర రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు, ఇదే మైనింగ్ కుంభకోణంలో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అరెస్టు అయ్యారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఈ మైనింగ్ కుంభకోణంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో అనిల్ యాదవ్ను అరెస్ట్ చేస్తారని నెల్లూరు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేసు విచారణకు హాజరు కావాలని అనిల్ కుమార్ యాదవ్కు పోలీసులు నోటీసులు ఇవ్వడం విశేషం.
ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు?
అయితే, అనిల్ కుమార్ యాదవ్కు ఇచ్చిన నోటీసు మైనింగ్ కుంభకోణానికి సంబంధించినది కాదని తెలుస్తోంది. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డిపై గెలిచారు ప్రశాంతి రెడ్డి. ఈ క్రమంలో అక్కడ రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రసన్న కుమార్ ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే అది వేమిరెడ్డి అనుచరుల పనేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో తాజాగా విచారణకు పిలిచారు పోలీసులు. అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరైతే పోలీసులు అరెస్ట్ చేస్తారని ప్రచారం నడుస్తోంది.
జగన్కు కుడిచేయి, ఇప్పుడు కష్టాల్లో?
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. వైసీపీ హయాంలో చాలా దూకుడుగా వ్యవహరించేవారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దిగేవారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై వ్యక్తిగత విమర్శలకు వెనుకాడేవారు కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. నెల్లూరులో తన సామాజిక వర్గ నేతలను కాదని, అనిల్కు రైట్హ్యాండ్గా అవకాశం ఇచ్చారు జగన్. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ పెద్దగా కనిపించలేదు. నెల్లూరు వచ్చి రాజకీయ విమర్శలు చేసేవారు. ఆయన దూకుడు పెంచుతున్న నేపథ్యంలో అరెస్టు చేయాలన్న ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో.