ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలుస్తోంది. మీరు చదివింది నిజమే! అయితే, పవన్ కళ్యాణ్ కేవలం నాలుగు రోజుల పాటు ఇన్ఛార్జ్ హోదాలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన సింగపూర్ పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో మంత్రులు నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్ తో పాటు, ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన కీలక అధికారులు కూడా పాల్గొంటారు. ఈ నెల 26 నుంచి 30 వరకు సీఎం బృందం సింగపూర్లో పర్యటించనుంది. సీఎం చంద్రబాబు తిరిగి వచ్చేవరకు, ఇన్ఛార్జ్ హోదాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
జనసైనికుల ఆకాంక్షలు నెరవేరేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి హోదాలో చూడాలని జనసైనికులు ఎప్పటినుంచో ఆకాంక్షిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఉండాలని కూడా చాలా మంది కోరుకున్నారు. అయితే, చంద్రబాబు సీనియారిటీని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతో సరిపెట్టుకున్నారు. అయినప్పటికీ, జనసైనికుల్లో మాత్రం పవన్ సీఎం కావాలనే కోరిక తగ్గలేదు. గతంలో మంత్రి లోకేష్కు పవన్ తో సమానంగా డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఆ సమయంలో జనసైనికులు పవన్ కళ్యాణ్కు సీఎం పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు పార్టీల మధ్య సోషల్ మీడియాలో కూడా వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా జోక్యం చేసుకుని, పార్టీ శ్రేణులకు సంయమనం పాటించాలని ఆదేశించారు. పదవుల విషయంలో బహిరంగంగా మాట్లాడవద్దని కూడా సూచించారు. అప్పట్లో టీడీపీ నాయకత్వం కూడా అప్రమత్తమై తమ పార్టీ శ్రేణులకు అలాంటి ఆదేశాలే ఇచ్చింది.