సుగాలి ప్రీతి’ కేసు మరోసారి రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ కేసులో న్యాయం కోసం సుగాలి ప్రీతి తల్లి, చెల్లి రోడ్డెక్కి ధర్నా చేయగా, వారి ఆవేదన అందరి హృదయాలను కదిలించింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదని ఆ కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ధర్నా సందర్భంగా సుగాలి ప్రీతి చెల్లి మాట్లాడిన మాటలు కంటతడి పెట్టించాయి. “పవన్ కళ్యాణ్ మామ ఆరోజు మీ ఆఫీసుకొచ్చినప్పుడు చెప్పావు కదా న్యాయం చేస్తానని… మరి మేము ఎందుకు ఇన్ని రోజులు ఏడవాలి? పోరాటం ఎన్నిరోజులని చేయాలి. మా అక్కను తిరిగి ఇవ్వవా ప్లీజ్” అంటూ ఆమె చేసిన విజ్ఞప్తి అక్కడి వాతావరణాన్ని విషాదభరితం చేసింది.
ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి రాగానే మొట్టమొదటి కేసుగా సుగాలి ప్రీతి కేసును టేకప్ చేసి పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట ఇచ్చారు.
ఇప్పుడు జనసేన అధికారంలో భాగస్వామిగా ఉన్నా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కీలక పదవిలో ఉన్నా… తమ కేసుపై ఎలాంటి పురోగతి లేకపోవడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘పవన్ కళ్యాణ్ ను మామయ్య’ అని పిలుస్తున్న ఆ అమ్మాయి, “నీ రాజకీయం కోసం మా ఫ్యామిలీని వాడుకున్నావ్” అంటూ నేరుగా ప్రశ్న సంధించడం సంచలనం సృష్టించింది. సుగాలి ప్రీతి తల్లి కూడా పవన్ కళ్యాణ్ తీరుపై ఇదే తరహాలో ప్రశ్నించారు.
దళితులపై, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతానని పదే పదే చెప్పిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం అధికారంలో ఉండి కూడా తమకు న్యాయం చేయకపోవడం పట్ల వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. సుగాలి ప్రీతి కుటుంబం తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, తక్షణమే తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.
https://x.com/Anithareddyatp/status/1995318082810876195?s=20

