జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీలో జరిగిన నకిలీ మద్యం స్కాంపై స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
“మద్యపాన ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అన్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. వైసీపీ పాలనలో అవినీతి జరుగుతోందని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిశ్శబ్దంగా కనిపిస్తున్నారు” అని కేతిరెడ్డి అన్నారు.
అలాగే నకిలీ మద్యం వ్యవహారంపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. “మా ప్రభుత్వంలో హైదరాబాద్ నుంచి రెండు బాటిళ్లు తీసుకువస్తేనే కేసులు వేశాం. కానీ ఇప్పుడు 16 నెలలుగా రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ జరుగుతోంది. అయినా పోలీసులు కళ్లుమూస్తున్నారు. ఇది పెద్ద కుట్ర” అని ఆయన ఆరోపించారు.
కేతిరెడ్డి మాట్లాడుతూ “వైసీపీపై ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టు చేస్తున్నారు. పార్టీ ఫ్లెక్సీ కడితేనూ కేసులు పెడుతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇలాంటి పాలనను ప్రజలు చూస్తున్నారు. అందుకే మేము పవన్ కళ్యాణ్ పై సీబీఐ విచారణ కోరుతున్నాం” అని అన్నారు.
ఇక రాజకీయ వర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తుత గమ్యం గురించి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల అనంతరం ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారని కొందరు చెబుతుంటే, మరికొందరు ఆయన సైలెంట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. ఏదేమైనా, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారన్న ప్రశ్న ప్రస్తుతం రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది.