ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని శాశ్వత రాజకీయ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా దూకుడుతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగానే, నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడం రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తోంది.
పవన్ ఇప్పటికే పిఠాపురంలో 12 ఎకరాల్లో తన నివాస నిర్మాణాన్ని వేగంగా చేపట్టారు. అదనంగా, పార్టీ కార్యకలాపాల కోసం మరో 3 ఎకరాల్లో జనసేన కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. ఇవి ఆయన పిఠాపురంపై చూపుతున్న దీర్ఘకాలిక రాజకీయ దృష్టికి నిదర్శనంగా పలువురు భావిస్తున్నారు.
పిఠాపురం శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. పురూహూతిక అమ్మవారి ఆలయం, ముక్కుటేశ్వర స్వామి దేవాలయం, శ్రీపాద శ్రీవల్లభ పీఠం వంటి ప్రముఖ ఆలయాలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని 19 ప్రధాన ఆలయాల అభివృద్ధికి పవన్ ప్రత్యేకంగా కృషి చేసి, దేవాదాయ శాఖ ద్వారా 20 కోట్ల రూపాయలు విడుదలకు ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఈ నిధులతో జీర్ణోద్ధారణ, మౌలిక వసతుల నిర్మాణం జరగనున్నది. దీంతో పిఠాపురాన్ని ‘ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం’గా తీర్చిదిద్దే ప్రక్రియ వేగవంతమైంది.
డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ పిఠాపురంలో శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభించడంతో, ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా వేడి మీదకి వచ్చింది. ప్రముఖులు, పెట్టుబడిదారులు పిఠాపురంపై దృష్టి పెట్టడంతో భూముల ధరలు గణనీయంగా పెరిగాయి.
చంద్రబాబు–కుప్పం, జగన్–పులివెందుల, బాలకృష్ణ–హిందూపురం, లోకేష్–మంగళగిరి లాగానే పవన్ పిఠాపురాన్ని తన శాశ్వత రాజకీయ కేంద్రంగా మార్చుకునేందుకు అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అభివృద్ధి వేగం పెరిగి, పిఠాపురం మొత్తం కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక–పర్యాటక, రాజకీయ కేంద్రంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.


