రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు స్వస్థలమైన జిల్లాలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలు బయటపడగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఇలాకాలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
పిఠాపురం పరిధిలోని ఉప్పాడ రైల్వే గేట్ వద్ద నకిలీ నెయ్యి తయారీ కేంద్రం నడుస్తోందని స్థానికులు వెల్లడించారు. ఆవుల కొవ్వును ఉపయోగించి నెయ్యిలా కనిపించే పదార్థాన్ని తయారు చేసి, మార్కెట్లో “శుద్ధ నెయ్యి” పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు.
ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఈ ఘటనపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ఈ కల్తీ నెయ్యి వ్యాపారం వెనుక అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దల మద్దతుతోనే ఈ నకిలీ వ్యాపారం ఇంత బలంగా కొనసాగుతోందని ప్రజల్లో చర్చనీయాంశమైంది.
ప్రతి రోజూ వాడే ఆహార పదార్థాల్లో ఇలా కల్తీ నెయ్యి చేరడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంత ముఖ్యమైన అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడం మరింత ఆశ్చర్యకరంగా మారింది.


