ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి రాజకీయ తగాదాలు వాగ్వాదాల స్థాయిని దాటి వ్యక్తిగత అవమానాల దాకా చేరాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమయ్యాయి.
సభలో మాట్లాడిన కామినేని, గత ప్రభుత్వ కాలంలో రఘురామకృష్ణంరాజు ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టే క్రమంలో “పందిలా కాళ్లు పైకి లేపి పిచ్చ కొట్టుడు కొట్టారు” అనే పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలు వినగానే సభలో కొంత హడావుడి నెలకొనగా, సోషల్ మీడియాలో అయితే ఇది పెద్దదిగా వైరల్ అయ్యింది.
ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు వ్యక్తిగత అవమానాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఈ ఘటనలో రఘురామపై ప్రజల్లో సానుభూతి రావాల్సిన దానికంటే, ఆయన గతంలో ఎదుర్కొన్న దాడుల వివరాలు ‘వినోదం’గా మారిపోయినట్లు కామెంట్లు వస్తున్నాయి. “ఇంత పెద్ద సభలో డిప్యూటీ స్పీకర్ను ఇలా పరువు పోయేలా మాట్లాడటం సరైంది కాదు” అంటూ నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
ముందు బాలయ్య–చిరంజీవి వివాదం ఇంకా చల్లారకముందే, ఇప్పుడు కామినేని వ్యాఖ్యలు కొత్త తుపానుకు దారితీశాయి. “టాలీవుడ్ మెగాస్టార్కు అవమానం జరిగిందని గగ్గోలు పెట్టిన కామినేని, ఇపుడు డిప్యూటీ స్పీకర్ గౌరవాన్ని కాపాడలేదా?” అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
రఘురామకృష్ణంరాజు తరచూ తన విపరీత వ్యాఖ్యలతో, బహిరంగ విమర్శలతో వార్తల్లో నిలుస్తారు. కానీ ఈసారి ఆయన స్వయంగా అవమానానికి గురైన అంశం చర్చనీయాంశమైంది. “పందిని పైకిలేపినట్టు అసెంబ్లీలో రఘురామ అవమానం” అంటూ మీమ్స్, సెటైర్లు ముంచెత్తుతున్నాయి.
రాజకీయ వాదోపవాదాలు సాధారణమే. కానీ నిండు సభలో ఒక డిప్యూటీ స్పీకర్ను వ్యక్తిగత అవమానం చేసేలా మాట్లాడటం మాత్రం ప్రజాస్వామ్య పద్ధతులకు తగదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.