Nara Lokesh : నారా లోకేష్, రామ్మోహన్ నాయుడుల తొలగింపు.. చంద్రబాబు సంచలనం

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ సమూల ప్రక్షాళనకు సిద్ధమవుతోంది. మహానాడు నాటికి జాతీయ, రాష్ట్ర కార్యవర్గాలతో పాటు పొలిట్ బ్యూరోలో కీలక మార్పులను అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సీనియర్ నాయకులను పక్కన పెట్టి, యువతకు అవకాశాలు కల్పించి, పార్టీలో నూతన శక్తిని ప్రవేశపెట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తద్వారా పార్టీ భవిష్యత్తును మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం నారా లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే, రామ్మోహన్ నాయుడు కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు. తాజా మార్పుల ప్రకారం, ఈ ఇద్దరూ తమ పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు, లోకేష్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో, నందమూరి బాలకృష్ణకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వనున్న అవకాశం ఉంది. ఈ మార్పులు లోకేష్ భవిష్యత్తును మరింత పరిపక్వం చేసేలా ఉంటాయని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో అనేక మంది సీనియర్ నేతలు కొనసాగుతున్నారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, నక్క ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎండి షరీఫ్, బోండా ఉమామహేశ్వరరావు, ఎం ఎం డి ఫరూక్, రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, గల్లా జయదేవ్, పితాని చంద్రశేఖర్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, అరవింద్ కుమార్ గౌడ్ సభ్యులుగా ఉన్నారు. అలాగే, ఎక్స్ అఫీషియో సభ్యులుగా నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ ఉన్నారు. తాజా మార్పుల ప్రకారం, కొందరు సభ్యులను తొలగించి, కొత్తవారిని చేర్చే అవకాశం ఉంది.

జాతీయ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న లోకేష్, రామ్మోహన్ నాయుడు పదవులు వదులుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వీరి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. అలాగే, కొత్త కమిటీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ పదవులు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ మార్పులను పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో పదవుల పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ పెరుగుతోంది.