రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పది రోజులు దాటినా ఇంకా వారికి జీతాలు చెల్లించలేని దుస్థితి కూటమి పాలనలో నెలకొందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా 10వ తారీఖు వచ్చినా కూడా జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. “ఉద్యోగులు తమ నెలవారీ ఖర్చులకు, ఈఎంఐలకు, ఇంటి అవసరాలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. “జీఎస్డీపీలో (GSDP) దూసుకుపోతున్నాం అంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలతో, సొల్లు మాటలతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేని పరిస్థితిలో, ఈ ‘దూకుడు’ కబుర్లు దేనికి సంకేతం?” అని ఆయన ప్రశ్నించారు.
కూటమి పాలనలో రాష్ట్రం ఆర్థికంగా, పాలనాపరంగా పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రం కేవలం అప్పులు, అవినీతి, అరాచకాలలో మాత్రమే దూసుకుపోతుంది. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు, కానీ అప్పులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గాలిలో దీపంలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు జీతాలు చెల్లించి, వారి సమస్యలను పరిష్కరించాలని” వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.


