జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి విడుదల చేసిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైందని, ఈ చేదు నిజాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా రెండో రోజుకే అంగీకరించాల్సి వచ్చిందని వార్తలు వెలువడుతున్నాయి. “మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ జనసేన కార్యకర్తలు, అభిమానులను ఉద్రేకపరిచి, విస్తృత ప్రచారం మధ్య విడుదలైన ఈ చిత్రం, రాజకీయ లబ్ది కోసమే తెరకెక్కించబడిందన్న ఆరోపణలు ఎదుర్కొంది.
సినిమాను కేవలం ఒక చిత్రంగా కాకుండా, దానికి రాజకీయ రంగు పులిమి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని పవన్ కళ్యాణ్ భావించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ‘వీరమల్లు’ చిత్రం కోసం తెలుగుదేశం కార్యకర్తలను సైతం వాడుకున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, రాష్ట్రంలోని ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఈ సినిమాకు అనుకూలంగా ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం.
వాస్తవానికి, సినిమా బాగుంటే ప్రత్యేక ప్రచారం అవసరం లేదని, బాగోలేకపోతే ఎంత ప్రచారం చేసినా ప్రేక్షకులు థియేటర్లకు రారని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయినా సరే, పవన్ కళ్యాణ్ తనను తాను దైవాంశ సంభూతుడిగా భావించుకుంటూ, “మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ జనసేన కుర్రాళ్లను రెచ్చగొట్టి మరీ హడావిడి చేశారు.
మొదటి రోజు కేవలం అభిమానులు, జనసేన కార్యకర్తలు మాత్రమే థియేటర్లలో సందడి చేయగా, సాయంత్రానికి వివిధ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఛానెళ్లలో వచ్చిన రివ్యూలు, చూసిన వారి మౌత్ పబ్లిసిటీ దెబ్బకు రెండో రోజుకే సినిమా అసలు రంగు బయటపడింది. విడుదల ముందు విస్తృత ప్రచారంతో మీసం మెలేసిన పవన్, ఇప్పుడు నీరసించి, వాయిస్లో తేడా వచ్చి, తాను పేద కుటుంబంలో పుట్టానని, హీరో అయ్యానని, రాజకీయ పార్టీ పెట్టానని, గెలుపు ఓటములు తనకు పెద్దగా లెక్కలేదంటూ బాధను అణచుకొని గాంభీర్యం చూపుతున్నారని పరిశీలకులు తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొత్తం సాఫ్ట్ అయిపోయి శ్మశాన వైరాగ్యం కబుర్లు చెబుతుండటంతో, ఈ ఫలితం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా బాగానే గుణపాఠం అయిందని జనం భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఫలితం జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.