ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన రిమాండ్ రిపోర్టులో సంచలనమైన విషయాలు వెలుగు చూశాయి.
పోలీసుల విచారణలో పోసాని తన గతంలో కులాలు, వర్గాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను అంగీకరించినట్లు సమాచారం. అంతేకాక, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కుటుంబ సభ్యులను దూషించిన విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. అయితే, ఈ వ్యాఖ్యలు తానంతట తానే చేయలేదని, తన వెనుక ఒక రాజకీయ శక్తి ఉన్నట్టు పోసాని వెల్లడించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓ కీలక నేత సూచనల మేరకే తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు పోలీసు విచారణలో అంగీకరించినట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడానికి తాను మాట్లాడినట్లు పోసాని ఒప్పుకున్నట్లు రిపోర్ట్లో పేర్కొనబడింది. గతంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారుడిగా ఉండేవారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. అప్పట్లో ఆయన మీడియా సమావేశాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర విమర్శలు చేసేవారు. హైదరాబాదులోని ప్రెస్ క్లబ్లో ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు నిర్వహించి అనేక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా పోసాని పోలీసుల విచారణలో ఈ వ్యాఖ్యలు స్వతంత్రంగా చేయలేదని, తనకు ముందుగానే స్క్రిప్ట్ రాసిచ్చినట్లుగా స్పష్టంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయన చేసిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు రిమాండ్ రిపోర్టును శుక్రవారం రైల్వే కోడూరు కోర్టుకు సమర్పించారు.
కొద్దిరోజుల క్రితం ఏపీ పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించబడింది. ఈ నెల 12వ తేదీ వరకు ఆయన రిమాండ్లో కొనసాగనున్నారు.
ప్రస్తుతం రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కోసం పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. పోసాని ఇచ్చిన వాంగ్మూలంతో మరికొంతమంది నేతలపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిగి అరెస్టుల వరకు వెళ్లుతుందా లేదా వేచిచూడాలి.