వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూముల అక్రమాలకు పాల్పడిన ఆరుగురు మాజీ మంత్రులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే పలువురు వైసిపి నేతలు అరెస్ట్ కాగా, తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి.
జగన్ ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు భూ దందాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం వారి అరెస్టుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భూములు అడ్డగోలుగా కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి మంత్రులు తమ అనుచరులు, బినామీలతో కలిసి భారీగా భూ దోపిడీకి పాల్పడ్డారని సమాచారం. అప్పట్లో అధికారంలో ఉండటంతో చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అధికారం మారడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
గత కొద్ది నెలలుగా రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో భూ కబ్జాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు నివేదికను సీఎంకు అందజేశారు.
వైసిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయగా, అందులో 5.74 లక్షల ఎకరాలను నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఇందులో 55 వేల ఎకరాల రిజిస్ట్రేషన్ జరగ్గా, 8483 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆరుగురు మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహసిల్దార్లు, 23 మంది మండల సర్వేయర్లు కీలక పాత్ర పోషించినట్లు రెవెన్యూ శాఖ నివేదికలో పేర్కొంది.
భూ దందాకు పాల్పడిన వారిపై 1977 నాటి చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న ఆర్డీవోలు, తహసిల్దార్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం చంద్రబాబు ఈ విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.