అనంతపురం జిల్లా రాజకీయాల్లో మరోసారి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జెడ్పీ కార్యాలయంలో జరిగిన జెడ్పీ సమావేశం సందర్భంగా విధుల్లో ఉన్న ఓ సీఐను “రే.. రే.. కొడకా.. నీ అంతు చూస్తా” అంటూ బెదిరించిన ఘటన కలకలం రేపింది. ఈ బెదిరింపులు చేసినవారు అధికార పార్టీకి చెందిన నేత అన్న కారణంతో పోలీసుల స్పందన ప్రశ్నార్థకంగా మారింది.
సమావేశం జరుగుతున్న సమయంలో భద్రతా కారణాలతో అక్కడ ఉండకూడదని సీఐ సూచించడమే అసలు కారణం. ఆ మాట నచ్చక మైసూరారెడ్డి సీఐపై దూషణలకు దిగినట్లు సమాచారం. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పోలీసులు వద్దన్నప్పటికీ రంగోపాల్ రెడ్డి ఆయన్ను జెడ్పీ సమావేశంలోకి తీసుకెళ్లారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
ఇదే సమయంలో పౌర సమాజం నుంచి తీవ్ర ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే పని వైసీపీ నేతలు చేస్తే? రోడ్లపై తిప్పుతూ అరెస్టులు, ప్రెస్ మీట్లు, హడావుడి అన్నీ కనిపిస్తాయి. కానీ అధికార పార్టీ నేతలు పోలీసులను బూతులు తిట్టినా ఎందుకు మౌనం? చట్టం ముందు అందరూ సమానమేనా? లేక పార్టీ చూసే చట్టమా?
ఇది కేవలం ఒక ఘటన కాదు. తాడిపత్రిలో డీఎస్పీని పబ్లిక్గా దూషించిన ఘటన ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో తాజాగానే ఉంది. అప్పట్లో జేసీ ప్రభాకర్రెడ్డి చేసిన దూషణలపై కూడా కఠిన చర్యలు కనిపించకపోవడం ఇదే తరహా విమర్శలకు దారితీసింది.
ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ తటస్థంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇలాంటి ఘటనలు పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఎంతగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. విధుల్లో ఉన్న అధికారులను బెదిరించడం నేరం కాదా? అధికార పార్టీ నేతలైతే మినహాయింపా? అనే ప్రశ్నలు ఇప్పుడు సామాన్యుల నోట వినిపిస్తున్నాయి.
చట్టం ఒకరివైపు మాత్రమే కఠినంగా, మరొకరివైపు మృదువుగా ఉంటే అది న్యాయం కాదు, అది భయం. పోలీసుల మౌనం కొనసాగితే, ప్రజల విశ్వాసమే పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, పార్టీ కాదు.. చట్టమే పెద్దదని నిరూపించాల్సిన అవసరం ఉంది.
https://x.com/greatandhranews/status/2007368133292822955?s=20


