పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అనే చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని, పవన్ కళ్యాణ్ ఉండగా పిఠాపురంలో టికెట్ దక్కే అవకాశం లేదని వర్మ భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైఎస్సార్సీపీలో చేరడం ఉత్తమమని కొందరు సూచిస్తున్నారు. అయితే, వర్మ టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతారా లేదా అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఆయన సన్నిహితులు మాత్రం ఈ అవకాశాన్ని కొట్టిపారేస్తున్నారు. కానీ, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆయన వైఎస్సార్సీపీలో చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వర్మ తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడు. ఆయనకు ఆ పార్టీతో బలమైన అనుబంధం ఉంది. 2014లో టికెట్ లభించకపోయినా, వైఎస్సార్సీపీ నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ ఆయన ఆ పార్టీలో చేరలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఓడించి ఘన విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు ఆశించిన పదవి లేదా గుర్తింపు లభించలేదనే భావన ఉంది. దీంతో 2014లో మాదిరిగానే వర్మ కఠిన నిర్ణయం తీసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆత్మాభిమానం కలిగిన వ్యక్తిగా వర్మ గతంలో తన సత్తా చాటడానికి స్వతంత్రంగా పోటీ చేశారు. ఇప్పుడు కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంటారని కొందరు భావిస్తున్నారు. వర్మకు ఒక ప్రత్యేక నియోజకవర్గం అంటూ లేదు. పిఠాపురంతోనే ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, జనసేనతో పొత్తు కొనసాగుతున్నందున పిఠాపురంలో వర్మకు అవకాశం లభించడం కష్టమే. ఒకవేళ కూటమి ఎమ్మెల్సీ పదవి ఇస్తే దానితో సర్దుకుపోవాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో ఆయన జోక్యం కూడా పరిమితంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో, వర్మ టీడీపీని వీడితే ఎలా ఉంటుందనే ఆలోచనకు రావడం సహజం. అయితే, వెంటనే అలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటారా అనేది సందేహమే.
రాష్ట్రంలో ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలే గడిచాయి. మరో నాలుగేళ్లకు పైగా సమయం ఉంది. కాబట్టి, వర్మ అంత తొందరగా సాహసం చేయకపోవచ్చు. అలా చేస్తే ఆయన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతం ఆయన ప్రజల్లో బలంగా ఉంటూ, వారి సమస్యలపై పోరాడుతూ 2029 ఎన్నికల నాటికి ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇటీవల, వర్మ ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపారని, జగన్ దూతగా ఆయన వచ్చారని పుకార్లు షికార్లు చేశాయి. ముద్రగడ కుమార్తె దీనిపై స్పందించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే, వర్మ అనుచరులు మాత్రం ఇవన్నీ నిరాధారమైన వార్తలని కొట్టిపారేస్తున్నారు.
వర్మ ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కూటమిలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనివల్ల కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. పిఠాపురం నియోజకవర్గం విషయంలో కూడా మార్పులు ఉండొచ్చు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని వర్మ వేచి చూసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవిని స్వీకరించి, ప్రజల్లో తన పట్టును నిలుపుకుని, 2029 ఎన్నికల్లో తన సత్తా చాటాలనేది వర్మ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు.