టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, తొమ్మిదో సీజన్ను మరింత హంగామాగా ఆరంభించడానికి సిద్ధమవుతోంది.
ఈసారి ప్రత్యేకంగా ‘అగ్ని పరీక్ష’ అనే షో ద్వారా సాధారణ ప్రజలకు కూడా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో 45 మంది పోటీ పడగా, వారిలోంచి కొందరిని ఎంపిక చేసి, చివరికి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్కి పంపనున్నారు.
అయితే జడ్జెస్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రేక్షకుల్లో చర్చ నడుస్తోంది. దీనిపై నటుడు నవదీప్ స్పష్టతనిచ్చాడు. సెలబ్రిటీ కంటెస్టెంట్స్కు ముందే ఓటింగ్లో ఆదరణ లభిస్తుందని, కానీ సాధారణ కంటెస్టెంట్స్ మాత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకోవాలంటే వారి వ్యక్తిత్వం బయటపడాలని చెప్పారు. అందుకే ప్రత్యేకమైన టాస్క్లతో వారి నిజ స్వభావం వెలికి తీయడానికి, జనంలో వారికీ ప్రత్యేక క్రేజ్ తెచ్చేలా చేయడానికి జడ్జెస్ కఠినంగా ఉంటారని ఆయన వివరించారు.
మొత్తానికి ‘అగ్ని పరీక్ష’ ద్వారా బిగ్ బాస్లో సాధారణ ప్రజల భాగస్వామ్యం ఒక కొత్త ప్రయోగం. ఈ ప్రయోగం సీజన్ 9 విజయానికి ఎంత ఉపయోగపడుతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.