తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ5 మూర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక ఛానెల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన మూర్తి, ప్రస్తుతం టీవీ5 ఛానెల్ సీఈఓగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన ప్రారంభించిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు అనతికాలంలోనే విశేష ఆదరణ పొందాయి. ముందుగా చంద్రబాబు నాయుడుని, ఆ తర్వాత కల్వకుంట్ల కవితని మూర్తి ఇంటర్వ్యూ చేశారు. విభిన్నమైన ప్రశ్నలతో వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూలు సూపర్ క్లిక్ అయ్యాయి. రొటీన్కు భిన్నంగా, చాలా వినూత్నంగా ఉన్న ఈ ఇంటర్వ్యూలు కొన్ని పార్టీలకు బలంగా మారగా, మరికొన్ని పార్టీలకు సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.
రీల్స్తో అలరిస్తున్న మూర్తి
మూర్తి కేవలం పాత్రికేయుడు మాత్రమే కాదు. అప్పుడప్పుడు సరదాగా రీల్స్ చేస్తుంటారు. చిన్న వీడియోలు రూపొందించి తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేస్తుంటారు. అయితే, మూర్తి రూపొందించిన ఒక రీల్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చకు దారితీస్తోంది. ప్రముఖ సినీ నటుడు రచ్చ రవితో కలిసి ఆయన ఒక చిన్న వీడియోలో కనిపించారు.
ఆ వీడియోలో మూర్తి తన కారును ఒక సర్వీస్ సెంటర్కు తీసుకెళ్తాడు. ఈ లోగానే అక్కడ రచ్చ రవి కనిపిస్తాడు. మూర్తి “రవి, కారులో ఫ్యూయల్ అయిపోయింది. పోయి” అంటాడు. దానికి రవి ఇంజన్ ఫ్యూయల్ కాకుండా, సీసాలో ఉన్న మద్యాన్ని పోస్తాడు. మద్యాన్ని పోసిన తర్వాత ఆ కారు అటూ ఇటూ ఎగురుతూ ఉంటుంది. దీంతో మూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. “మందు మనుషులకే కాదు, చివరికి వాహనాలను కూడా షేక్ చేస్తుంది” అని ఈ వీడియో ద్వారా మూర్తి చెప్పాడు.
వీడియో వెనుక అంతర్గత సందేశం
ఈ వీడియో ఫన్నీగా ఉన్నప్పటికీ, రకరకాల ఆలోచనలను తెరపైకి తెస్తోంది. మూర్తికి సాధారణంగా తాగే అలవాటు లేదు. ఇటీవల ఆయన మాంసాహారం కూడా పూర్తిగా మానేసి, పూర్తి శాఖాహారిగా మారిపోయారు. తను ఏం తింటాడో, ఏం తాగుతాడో కూడా అప్పుడప్పుడు వీడియోలు పెడుతుంటాడు. రవి, మూర్తి కనిపించిన ఈ వీడియో ఆకట్టుకుంటున్నది. తాగడం వల్ల మనుషులు మాత్రమే కాదు, చివరికి వాహనాలు కూడా పాడవుతాయనే అంతర్గత సందేశాన్ని ఈ వీడియో ద్వారా మూర్తి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆయన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోక తప్పదు.