ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తిరుగుబాటు సన్నాహాలు చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే వైద్యులు, సచివాలయ సిబ్బంది, విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
జగన్ తన ట్వీట్లో కూటమి ప్రభుత్వం ఉద్యోగులను రోడ్డున పడేసిందని, వారి బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ మళ్లీ ఉద్యోగ సంఘాలతో అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగులే అన్న విషయం తెలిసిందే. గతంలో వారి జీతాల చెల్లింపులో జాప్యం, రాయితీల నిలుపుదల వంటి అంశాలు ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కూడా అదే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
దీపావళి కానుకగా డీఏల విడుదలపై వార్తలు వినిపిస్తున్న తరుణంలోనే వైసీపీ అనుకూల సంఘాలు మళ్లీ కదలికలు ప్రారంభించాయి. ఈ పరిణామాలు చూస్తుంటే జగన్ మరోసారి ఉద్యోగుల మద్దతు సంపాదించేందుకు పెద్ద ప్లాన్ వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.