విజయవాడలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం దందా, టిడిపి నాయకుల దుష్ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, “రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమ దందా వెనుక టిడిపి నేతల ప్రమేయం ఉందనే అనుమానం బలపడుతోంది” అన్నారు.
జగన్ మాట్లాడుతూ.. పరవాడ, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరు వంటి ప్రాంతాల్లోనూ ఇలాంటి నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు గుర్తించబడ్డాయని. ముఖ్యంగా పరవాడలో టిడిపి నేత అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడైన వ్యక్తి ఈ దందాకు పాల్పడుతున్నాడని తెలిపారు. “ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఈ నేరగాళ్లకు రాజకీయ ఆశ్రయం ఎవరిదో అందరికీ తెలుసు,” అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేశ్ పేర్లను ఉద్దేశిస్తూ జగన్ అన్నారు.“ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం వీరికి మాత్రమే సాధ్యం. రాష్ట్రంలో ఎక్కడ ఏ నేరం జరిగినా దాని వెనుక వీరి నీడ తప్పదు.”
తనపై, వైఎస్సార్సీపీ పై విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. “టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రతి రోజూ కొత్త కొత్త నాటకాలు వేసుకుంటున్నారు. కానీ నిజం ఎప్పటికీ దాచలేరు,” అని జగన్ హితవు పలికారు.
“రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటుంది. నకిలీ మద్యం తయారీ, సరఫరా చేసే వారిపై ఎవరైనా ఉన్నా రాయితీ లేకుండా కేసులు నమోదవుతాయి.” అని తెలిపారు.
జగన్ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చ చెలరేగింది. టిడిపి శిబిరం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.