రాజకీయాల్లో ‘వెన్నుపోటు’ అనే పదం తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదు. గతంలో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేజిక్కించుకున్న సందర్భాన్ని ప్రత్యర్థులు ఇప్పటికీ వెన్నుపోటుగానే అభివర్ణిస్తుంటారు. అయితే, ఇప్పుడు అదే తరహాలో తండ్రికి కొడుకే వెన్నుపోటు పొడవబోతున్నారా? అనే చర్చ తెరపైకి రావడం సంచలనం రేపుతోంది.
ప్రముఖ తెలుగు వార్తా సంస్థ టీవీ5 యాంకర్ మూర్తి ఒక చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ప్రశ్నలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
“గతంలో ఎన్టీఆర్ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శలు ఉన్నాయి. మరి ఇప్పుడు అదే బాటలో తండ్రి చంద్రబాబును లోకేష్ వెన్నుపోటు పొడవడానికి సిద్ధపడ్డారా?” అంటూ మూర్తి విపక్షాల వాదనను లైవ్ షోలో ప్రస్తావించారు.
సాధారణంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారని పేరున్న టీవీ5 ఛానెల్లోనే ఇలాంటి చర్చ జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను విశ్లేషించే క్రమంలో.. లోకేష్ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారా? లేక తండ్రి చాటు బిడ్డగా కాకుండా సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తూ చంద్రబాబు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారా? అనే కోణంలో చర్చ సాగింది.
ఈ వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. “సొంత మీడియాలోనే ఇలాంటి చర్చ జరుగుతుందంటే పార్టీలో ఏదో జరుగుతోంది” అని వైసీపీ శ్రేణులు విమర్శిస్తుండగా, ఇది కేవలం విపక్షాల విమర్శలను కౌంటర్ చేయడానికి అడిగిన ప్రశ్న మాత్రమేనని టీడీపీ మద్దతుదారులు కొట్టిపారేస్తున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పగ్గాలను లోకేష్ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలనుకోవడం వెన్నుపోటు అవుతుందా? లేక సహజమైన వారసత్వ బదిలీ అవుతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి.


