ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు చూస్తే… అవి రాజకీయ విశ్లేషణలకంటే ఎక్కువగా వ్యక్తిగత అసహనానికి, కడుపు మంటకు ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, వైసీపీలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాస్తవాల కంటే ఊహాగానాలకే ఎక్కువ దగ్గరగా ఉన్నాయి.
ప్రతిపక్షాలు పరస్పరం సహకరించుకుంటాయా? అవసరమైతే అవును. అది ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రక్రియ. కానీ దాన్ని తన యాజమాని చంద్రబాబుపై జరుగుతున్న “కుట్ర”గా చిత్రీకరించడం రాధాకృష్ణ రాజకీయ అజెండాను బట్టబయలు చేస్తోంది. ఒక మీడియా సంస్థ అధినేతగా ఉండి, సమతూకంగా మాట్లాడాల్సిన బాధ్యతను విస్మరించి, పోతురాజులా యజమాని కోసం దూకుడుగా వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగ్గది కాదు.
తన పత్రికలో ‘కొత్తపలుకు’ అనే కాలమ్ పేరుతో రాధాకృష్ణ వ్యక్తిగత అక్కసునంతా బయటపెట్టడం మరింత విచారకరం. అది విశ్లేషణ కంటే ఆరోపణలకే ఎక్కువ చోటిచ్చింది. బీఆర్ఎస్, వైసీపీలు కలిసి పనిచేస్తున్నాయన్న వాదనను నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ ప్రత్యర్థులపై విషం చిమ్మడమే లక్ష్యంగా కనిపించింది.
మీడియా అనేది ప్రజల కోసం ఉండాలి, యజమానుల కోసం కాదు. రాజకీయ విమర్శలు చేయొచ్చు, ప్రశ్నలు వేయొచ్చు. కానీ అవి వ్యక్తిగత భక్తికి, కడుపు మంటకు అద్దం పట్టేలా ఉండకూడదు. రాధాకృష్ణ తాజా వ్యాఖ్యలు చూస్తే… ఆయనలో జర్నలిస్టు కంటే, రాజకీయ కార్యకర్తే ఎక్కువగా మాట్లాడుతున్నాడన్న భావన ప్రజల్లో బలపడుతోంది. ఇదే ఆయన విశ్వసనీయతకు పెద్ద సవాలుగా మారుతోంది.

