తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ ముసురుకున్న రాజకీయ దుమారం ఇప్పుడు అసెంబ్లీని కుదిపేస్తోంది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అనుసరించిన వ్యూహం, చేసిన నినాదాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో గత వైకాపా ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు వైసీపీ నేతలు ‘అసెంబ్లీ’ వేదికగా వినూత్న నిరసనకు దిగారు.
అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు “గోవిందా.. గోవిందా..” అంటూ నినాదాలు చేస్తూ సభను హోరెత్తించారు. లడ్డూ వివాదంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలనే బురదజల్లుతోందని, భక్తుల మనోభావాలతో ఆడుకుంటోందని వారు మండిపడ్డారు. ముఖ్యంగా టీడీపీ కూటమిని లక్ష్యం చేసుకుని సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ను ప్రస్తావిస్తూ సభలో గందరగోళం సృష్టించారు.
వైసీపీ నేతల ప్రధాన విమర్శ అంతా ‘నెయ్యి – కొవ్వు’ అంశం చుట్టూనే తిరుగుతోంది.లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న ప్రచారాన్ని “అబద్ధపు ప్రచారం”గా వైసీపీ అభివర్ణిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే శ్రీవారి ప్రసాదంపై అపవిత్రమైన ఆరోపణలు చేశారని, ఆ “పాపం” ఆయనను, ఆయన టీమ్ (కో) ను వదలదని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. అసెంబ్లీ లోపలే కాకుండా, బయట కూడా టీడీపీ నేతలను ఉద్దేశించి “కొవ్వు పాపం నీడలా వెంటాడుతుంది” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

